రాష్ట్ర ప్రభుత్వం షాపులు మరియు సంస్థలకు సంబంధించి రెండు జీఓలు జారీ చేసింది. ఈ జీఓలు వీటిలో పనిచేసే కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమైన సమస్యపై కనీసం కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. ఇప్పటికే షాపులు మరియు సంస్థలలో పనిచేసే కార్మికుల పనిగంటలను 8 నుండి 10కి పెంచింది. అదే సమయంలో వారానికి 48 గంటలు పనిచేస్తే సరిపోతుందన్నది. కానీ 10 గంటలు పనిచేస్తే అదనంగా ఒకరోజు సెలవు వస్తుందని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కొద్ది కాలంలోనే ఇప్పుడు మరో జీఓ జారీ చేసి షాపులు, సంస్థలను యజమానులు ప్రతిరోజూ 24 గంటలు తెరిచి ఉంచవచ్చని, కార్మికులతో పనిచేయించుకోవచ్చని చెప్పింది. కానీ పని వారానికి 48 గంటలు మాత్రమేనని మళ్లీ ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడింది. వారానికి 48 గంటలు మించితే ఓవర్‌టైమ్ ఇవ్వాలని చెప్పింది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. షాపుల్లో కార్మికులు రోజుకు 8 గంటలకు మించిన పని కాలానికి డబుల్ ఓటీ లేకుండా 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ అధికారులు దీన్ని చూసి చూడనట్లు నటిస్తున్నారు. 24 గంటలూ సంస్థలు, షాపులు తెరిచి ఉన్నట్లయితే 8 గంటల పని విధానం ప్రకారం మూడు షిప్ట్‌లు ఉండాలి. ఇప్పుడు కనీసం ఆ పద్ధతిని కూడా పేర్కొనకుండా పని చేయమనడం కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికే. 48 గంటలు దాటితే ఓటీకి అర్హత ఉంటుందని చెప్పడం కార్మికులను మోసపుచ్చడానికే. షాపులు, సంస్థలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్స్ లేకుండా కేవలం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలని చెప్పడం కూడా కార్మిక చట్టాలు పాటించని యజమానులను రక్షించడానికే. షాపులు, ఫ్యాక్టరీలు మినహా మిగతావన్నీ సంస్థల క్రిందకు వస్తాయి. బార్లు, హోటల్స్ తదితరాలన్నీ కూడా దీని క్రిందకు వస్తాయి. అపారమైన సంఖ్యలో ఉన్న కార్మికులను దోపిడీ చేసుకుని యజమానులు తమ వ్యాపారాలను తేలిక చేసుకునేందుకు, వేగంగా చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్మికుల ప్రయోజనాలు దానికి పూచిక పుల్లగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు కూటమి ప్రభుత్వ విధానాలను ఎదురించి పోరాడాలని, 8 గంటల పని విధానాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాము. ఈ రెండు జీఓ లను వెంటనే ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Comments

Popular posts from this blog

ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) నూతన రాష్ట్ర కమిటీ

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు

సెల్ఫ్ వీడియోలతో వినూత్న రీతిలో సిఐటియు అఖిలభారత మహాసభల కోసం ప్రచారం