పారిశ్రామిక సమ్మిట్ పేరిట కార్పొరేట్లకు వరాలు.. కార్మికులపై భారాలా ?
విశాఖలో ఎపి లేబర్ సమ్మిట్ – 2025
విశాఖ : పారిశ్రామిక సమ్మిట్ పేరిట కార్పొరేట్లకు వరాలు అందిస్తూ కార్మికులపై భారాలు మోపు తున్నారని పలువురు వక్తలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులంతా ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సమ్మిట్కు ప్రత్యామ్నాయంగా సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సిఐటియు అఖిల భారత మహాసభ సందర్భంగా మంగళవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్ లేబర్ సమ్మిట్- 2025’ పేరిట సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్.చలం మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. అందువల్ల దేశంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న 31 కోట్ల మంది కార్మికులకు ఎటువంటి రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు. కర్మాగారాల్లో పని చేసే వారు మాత్రమే కార్మికులు కాదని, శ్రమను నమ్ముకొని పనిచేస్తూ, మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే వారంతా కార్మికులేనని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభంలో అనేక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో వచ్చాయని, వీటితో దేశానికి ఆదాయం వచ్చిందని వివరించారు. కేంద్రంలో బిజెపి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తోందని విమర్శించారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ‘కష్టం మాది – సంపద మీదా’ అన్న నినాదంతో కార్మిక వర్గం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment